schedule Thursday, September 03, 2026

‘చేత’గాని సర్కారు..!

calendar_today September 3, 2026
person dharshininews
‘చేత’గాని సర్కారు..!
‘చేత’గాని సర్కారు..! - వెయ్యి రోజులు దాటినా హామీల అమలేది? - రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం: పైలట్ రోహిత్ రెడ్డి పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా.. ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దేముల్ మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబీమా వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమలులో విఫలమైందని విమర్శించారు. సాగు సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎరువుల కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు బీమా, పరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాగునీరు, వ్యవసాయ విద్యుత్ విషయంలోనూ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు గ్యారెంటీ కార్డులతో వంద రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వెయ్యి రోజులు దాటినా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు రమేష్, జనార్ధన్ రెడ్డి, వెంకటేష్ చారి, డీవై నర్సింలు, అంజి, వెంకట్ రెడ్డి, రవి, ధనసింగ్, జ్ఞానేశ్వర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   https://www.dharshininews.com/44519/