schedule Thursday, September 03, 2026

కోకట్ టీచర్ జపాన్ బాట..!

calendar_today August 18, 2026
person dharshininews
కోకట్ టీచర్ జపాన్ బాట..!
కోకట్ టీచర్ జపాన్ బాట..! - విద్యా సంస్కరణలపై అధ్యయనానికి అవకాశం - వికారాబాద్ జిల్లా నుంచి ఎంపిక - ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపిన కృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా నుంచి యాలాల మండలం కోకట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నూతన బోధనా విధానాలపై అవగాహన పెంపొందించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయులకు విదేశీ అధ్యయన పర్యటనకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి ఆయన జపాన్‌లోని విద్యా విధానాలు, పాఠశాలల్లో అమలవుతున్న ఆధునిక బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన విధానాలను పరిశీలించనున్నారు. వచ్చే నెల 5 నుంచి 12వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ అధ్యయన పర్యటన కొనసాగనుంది. జపాన్ విద్యా వ్యవస్థలోని ఉత్తమ విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటిని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అనుసరించే అవకాశాలపై అవగాహన పొందనున్నారు. ముఖ్యంగా బోధన, పాఠశాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. కోకట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు జపాన్ అధ్యయన పర్యటనకు ఎంపిక కావడం పట్ల స్థానిక విద్యా వర్గాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి, తన ఎంపికలో ప్రోత్సాహం అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి, జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖాధికారి, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, గెజిటెడ్‌ హెడ్మాస్టర్‌లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/44243/