నారా మహిపాల్ రెడ్డి ఇకలేరు
March 8, 2023
dharshininews
నారా మహిపాల్ రెడ్డి ఇకలేరు
- గుండెపోటుతో అకస్మిక మరణం
- సంతాపం తెలిపిన రాజకీయన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత నారా మహిపాల్ రెడ్డి(50) ఇకలేరు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తాండూరు పట్టణం పాత తాండూరులోని ఆయన నివాసంలో ఉండగా సాయంత్రం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్దారించారు. మొదటి నుంచి నారా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. యూత్ కాంగ్రెస్ నాయకులుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హాయాంలో నారా మహిపాల్ రెడ్డి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నారా మహిపాల్ రెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న నేతలు విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు ఆయన మరణంపై సంతాపం ప్రకటించారు. మరోవైపు గురువారం తాండూరులో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు.